ఆ ముద్దాయిలాంటివాడే చంద్రబాబు..! | ys jagan mohan reddy slams CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

Feb 5 2018 5:44 PM | Updated on Jul 25 2018 5:27 PM

ys jagan mohan reddy slams CM chandrababu naidu - Sakshi

సాక్షి, బుచ్చిరెడ్డిపాలెం: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ను చూసి చంద్రబాబు విలవిలలాడిపోయారని.. ఆయన అనుకూల మీడియా ఊదరగొడుతోందని, ఆయన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

ప్రజల పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘గత రెండు మూడు రోజులుగా టీవీ చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందా? అని నాకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ను చూసి బాబు విలవిలలాడిపోయాడట. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు కేంద్ర కేబినెట్‌ దానిపై చర్చించి ఆమోదిస్తోంది. ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతారు. కేంద్ర కేబినెట్‌లోని టీడీపీ మంత్రులు కూడా ఆమోదించిన తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అలాంటప్పుడు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చంద్రబాబు ఎందుకు గింజుకుంటున్నారు’ అని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మండిపడ్డారు. ఈ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు, నీ ఎంపీలు మంత్రులుగా ఉండి బడ్జెట్‌కు ఆమోదం ఎందుకు తెలిపారని చంద్రబాబును నిలదీశారు. నాలుగేళ్లు నిరీక్షించి.. విసుగెత్తిపోయామని చంద్రబాబు లీకులు ఇస్తూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఎన్నికలు సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారని,  ప్రజలకు అన్యాయం జరిగిందని, తానే ఆ అన్యాయం చేశానని బాబుకు గుర్తుకువస్తుందని  ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బాబు తీరును వివరిస్తూ వైఎస్‌ జగన్‌ ఓ కథ చెప్పారు.

‘అనగనగా ఒక ముద్దాయి.. ఆ ముద్దాయి కోర్టు బోనులో నిలబడ్డాడు. కాసేపటికి జడ్జ్‌ వచ్చాడు. జడ్జ్‌ రాగానే ముద్దాయి బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ‘తల్లిదండ్రీ లేనివాడిని.. నేను అనాథను.. నాకు దిక్కెవరు లేరు సార్‌’ అంటూ తనను విడ్చిపెట్టాలని జడ్జ్‌గారిని వేడుకున్నాడు. జడ్జ్‌గారు.. ఈ ముద్దాయి తల్లీదండ్రీ లేని అనాథ అంటున్నాడు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగారు. ఏమిటి ఇతడు చేసిన తప్పు అని ప్రశ్నించారు. దానికి.. ‘ఇతనివన్నీ దొంగ ఏడ్పులు. నమ్మకండి సార్‌. తల్లిదండ్రీని చంపి.. బోనులో నిలబడి.. ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడు’ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.. అచ్చం ఆ ముద్దాయి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు ఉంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు. రాష్ట్రం విడిపోవడానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని, దుగ్గరాజపట్నం పోర్టు  ఇవ్వకపోయినా పర్లేదని కేంద్రానికి చెప్పింది బాబేనని, పోలవరం ప్రాజెక్టు ఇంత అధ్వాన్నంగా అగోరించడానికి కారణం కూడా ఆయనేనని నిప్పులు చెరిగారు. ఇన్ని పాపలు, నేరాలు చేసిన బాబుకు, కోర్టులో ఏడ్చిన ఆ ముద్దాయికి ఏమైనా తేడా ఉందా? అని ప్రశ్నించారు. దారుణంగా అబద్ధాలు చెప్పి.. వాటిని నమ్మించే ప్రయత్నం చేయడం, తనకు అనుకూలంగా ఉన్న మీడియా వ్యవస్థను అందుకు వాడుకోవడం బాబు నైజమని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement