ముఖ్యమంత్రే దళారీల కెప్టెన్‌ అయ్యారు : వైఎస్‌ జగన్‌

YS Jagan Comments In Anna Pilupu Program In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అన్న పిలుపు’  కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు  సలహాలు, సూచనలు ఇవ్వాలని హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు.

ఎక్కడ అమ్మితే కనీస మద్దతు ధర వస్తుందో!?
అన్నపిలుపు కార్యక్రమంలో భాగంగా రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి 12రూపాయలకు కొన్న కేజీ మామిడిని.. హైదరాబాద్‌లో రూ. 60-70 మధ్య అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇంత తేడా ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని .. ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గడచిన రెండేళ్లుగా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌యార్డుల్లో అక్రమంగా 20శాతం ఫీజులు వసూలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. మామిడి, టమోటా రైతులు కష్టాలు తీర్చాలని కోరారు. కనీస మద్దతు ధరలు ప్రకటించినా అవి రైతులకు అందడం లేదని.. ఎక్కడ అమ్మితే కనీస మద్దతు ధర వస్తుందో వారికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే దళారీల కెప్టెన్‌ అయ్యారు!
రైతు వెంకటరెడ్డి ప్రస్తావించిన సమస్యల గురించి స్పందించిన వైఎస్‌ జగన్‌.... ‘ప్రజాసంకల్ప యాత్రలో ఈ అంశం గురించి నేను ప్రస్తావించా.  ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు గల్లా, ఆదికేశవులు కుటుంబానికి చెందిన శ్రీని ఫుడ్స్, పక్కనే హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ఇవన్నీ కూడా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇలా చేస్తే.. ఇక రైతులకు ఎలా మద్దతు ధర వస్తుంది. ఈ సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఉన్నవాడు దళారీలకు సహకరిస్తే మద్దతు ధర రాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్‌ అయ్యాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు ఆయనే కొనుగోలు చేసి.. నాలుగు రెట్లకు ప్యాక్‌ చేసి అమ్ముతున్నాడు. నాన్న హయాంలో రైతులకు లభించిన ధరలు మీ అందరికీ తెలుసు. ఆయన బాటలో రూ. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నాం. పంటవేసే ముందు ధరను నిర్ణయిస్తాం. ప్రభుత్వ రంగంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియను ప్రోత్సహిస్తాం. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు.

మంత్రి ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మక్కయ్యారు
చంద్రబాబు పాలనలో అంతా పక్షపాతమేనని ఐరాలకు చెందిన చలపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఫ్యాక్టరీల యజమానులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘ఫ్యాక్టరీ యజమానులు జట్టుగా మారిపోయారు. పచ్చ చొక్కాలకే లబ్ది చేకూరుస్తున్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. ఆయన చేసిన ప్రమాణానికి అర్థం లేకపోయింది. పోలీసులు, అధికారులు అందరూ పక్షపాతం చూపిస్తున్నారు. మతం, కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు’ అని వాపోయారు. ప్రజల కష్టాలు అర్థం చేసుకుని వైఎస్‌ జగన్‌ నవరత్నాలు ప్రకటిస్తే.. ఇప్పుడు వాటిని కూడా దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం హేమ చంద్ర అనే వ్యక్తి మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీకి జబ్బు చేసిందని, మన్నవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తై ఉంటే 5 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని.. కానీ ఇప్పుడు 10 మంది సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు మాత్రం ఇచ్చారని వాపోయారు.

ఆరోగ్య శ్రీ అమలు చేస్తాం.. ఎవరికీ లంచాలు ఇవ్వక్కర్లేదు
వీరి సమస్యలకు స్పందనగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ ఈ రెండూ కలిపి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు మన్నవరం ప్రాజెక్టు. ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలన్న అంశంపై ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి రావాలని వైఎస్సార్‌ గట్టి పట్టుబట్టారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఈ ప్రాజెక్టును సాధించారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతోంది. మనకు ఉద్యోగాలు రావాలంటే విప్లవాత్మక మార్పులు రావాలి. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. దేవుడి దయ వల్ల ప్రభుత్వం ఏర్పాటు కాగానే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకు వస్తాం. ప్రతి కంపెనీ అమలు చేయక తప్పని పరిస్థితి తీసుకు వస్తాం. ఉద్యోగాల కల్పనపై మా పాలనలో ప్రత్యేక దృష్టి. రాష్ట్రంలో 2.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే... వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన లేదు. ఉన్న స్కూళ్లను మూసేస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. వీటికి అనుసంధానంగా గ్రామ వాలంటీర్లను తీసుకొస్తాం. ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని వాలంటీర్‌గా పెడతాం. గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై డోర్‌ డెలివరీ చేస్తారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాలకోసం తిరగాల్సిన పనిలేదు. గ్రామ వాలంటరీకు ఒక్కొక్కరికీ రూ.5వేలు జీతం ఇస్తాం. ప్రత్యేక హోదా అన్నది మరొక ఎత్తు. 25కి 25 మొత్తం ఎంపీ స్థానాలన్నీ మనమే సాధించుకుందాం. ప్రత్యేక హోదాకు సంతకం పెట్టిన పార్టీకే..మద్దతు ఇస్తాం. ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపుపన్ను, జీఎస్టీ కట్టాల్సిన అవసరంలేదు.ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్సార్‌ అమలు చేస్తున్నప్పుడు దేశం మొత్తం మనవైపు చూసింది. నాన్న కన్నా ఒక అడుగు ముందుకు వేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తాం’ అని పేర్కొన్నారు.

ఆప్కో చైర్మన్లు లంచాలు తీసుకుంటున్నారు!
జీఎస్టీతో చేనేతల ఇబ్బందులు మరింత పెరిగాయని సత్యవేడుకు చెందిన భక్తవత్సలం తెలిపారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. ఉత్పత్తి వ్యయం తగ్గించాలని కోరారు. గతంలో వైఎస్సార్‌ రుణమాఫీ చేసి.. చేనేతలను ఆత్మహత్యల నుంచి కాపాడారని గుర్తు చేసుకున్నారు. ఇందుకు బదులుగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘చేనేతల సమస్యలను నేను పాదయాత్రలో తెలుసుకున్నా. తమిళనాడులో 250 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తారు. మేం అధికారంలోకి వస్తే మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేలు ఇస్తాం. నవరత్నాల్లో చెప్పినవి కాక ఈ సహాయం అందుతుంది. చేనేతలు ఆకలి బాధలకు గురికాకూడదు. ఆప్కో నుంచి చేనేతలకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ రావడంలేదు. ఆప్కో ఛైర్మన్లుగా ఉన్నవాళ్లు స్కూలు యూనిఫారమ్స్‌లోనూ లంచాలు తీసుకునే పరిస్థితి ఉందని పాదయాత్రలో నాకు చెప్పారు. టీడీపీ మాదిరిగా కాకుండా ఏ విధానమైనా చాలా పారదర్శకంగా ఉండేలా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా రైతుల పరిస్థితి అధ్వానం
చిత్తూరు జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్లు అందడం లేదని.. రాష్ట్ర అభివృద్ధిలో సమతుల్యత లేదని రాయలసీమ మేధావుల సంఘ సభ్యుడు పురుషోత్తం రెడ్డి అన్నారు. రూజ్‌వెల్ట్‌ అమెరికాను సమగ్రంగా అభివృద్ధి చేసినట్లుగా.. ప్రాంతాల వారీగా ఉన్న అసమానతలను తొలగించాలని కోరారు.  ఈ అంశంపై సమగ్ర విధానం రావాలన్నారు. మనకు కావాల్సింది సింగపూర్‌ కాదని క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యలకు స్పందనగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘గోదావరిలో 3వేల టీఎంసీల నీళ్లు కలిసి పోతున్నాయి. ఈ నీటిని దుమ్ముగూడెం- నాగార్జున సాగర్‌ టెయిల్‌ ప్రాజెక్టు ద్వారా సాగర్‌ను నింపాలని వైఎస్సార్‌ ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటే... దుమ్ముగూడెం- సాగర్‌ ప్రాజెక్టు మెటీరియల్‌ అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, తెలంగాణకు కూడా మేలు జరుగుతుంది. మంచి చేయగలిగే అవకాశం వస్తే కచ్చితంగా దీనికోసం అడుగులు వేస్తాను. ఇది జరిగితే పోలవరం ప్రాజెక్టుకు ఈ నీళ్లు అదనం అవుతాయి’ అని వ్యాఖ్యానించారు.

ఉచిత విద్య అందిస్తే బాగుంటుంది
ఫీజు రియంబర్స్‌మెంట్‌ కన్నా ఉచిత విద్య అందిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భాస్కర్‌ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులకు అపర కర్మలు చాలా ముఖ్యమని.. అందుకే ప్రతి గ్రామంలో ఒక భవనం ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులకు స్టైఫండ్‌ ఇవ్వాలని.. వారి మరణానంతరం కుటుంబాలకు పెన్షన్‌ ఇస్తే బాగుంటుందన్నారు. చిత్తూరు జిల్లా బాగా వెనకబడి ఉందని.. చిన్న చిన్న జబ్బులకే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. ప్రతి ఆరోగ్య పరీక్ష, చికిత్సకు కచ్చితమైన ధర నిర్ణయించాలన్నారు. తుంగభద్రలో వాటాగా రావాల్సిన నీళ్లు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు.

ఈ విషయాల గురించి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘మనం వచ్చాక పూర్తి స్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం. ఇంచుమించు మనం ప్రకటించిన పథకాలు అవే పద్ధతిలో ఉన్నాయి. న్యాయవాదులు ప్రజాసంకల్పయాత్రలో ఇవే కోరారు. కచ్చితంగా చేస్తాం. స్కూళ్లలో, కాలేజీల్లో ఫీజులు ఈ రకంగా ఉంటే.. ఎవ్వరూ కూడా చదువుకోలేరు. వైద్య పరీక్షలు, చికిత్సల కోసం రేట్లపై ఒక నియంత్రణ కూడా ఉండాలని గట్టిగా భావిస్తున్నాం. స్కూలు, కాలేజీ ఫీజులను కచ్చితంగా నియంత్రిస్తాం. ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top