అవి నీవు పెట్టించిన కుట్ర కేసులే! | Vasireddy Padma Comments On Chandrababu Politics | Sakshi
Sakshi News home page

అవి నీవు పెట్టించిన కుట్ర కేసులే!

Mar 24 2019 5:52 AM | Updated on Mar 24 2019 5:52 AM

Vasireddy Padma Comments On Chandrababu Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం చంద్రబాబులేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక సోనియాగాంధీతో కుమ్మక్కై ఆనాడు పెట్టిన కుట్ర కేసులనే జగన్‌ అఫిడవిట్‌లో చూపించారన్నారు. వైఎస్సార్‌ బతికున్నంత వరకూ జగన్‌మోహన్‌ రెడ్డిపై కేసులు లేవన్నారు. ఎప్పడయితే కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్‌సీపీ స్థాపించారో అప్పుటి నుంచి కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా మాట్లాడారు. 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు నేడు జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 17 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారో ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొని ప్రజల ముందుకు రావాగలరా అని ప్రశ్నించారు. ప్రజల మనసులు గెలుచుకున్న జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఈ ఐదేళ్లు చేతగాని దద్దమ్మ పాలన చేసి..నేడు ప్రతిపక్షనేతపై బురదచల్లడం దారుణమని చెప్పారు.

ఐదేళ్లల్లో 100 రెట్ల ఆస్తులు ఎలా పెరిగాయి? 
చంద్రబాబు ఈ ఐదేళ్లలో తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే 100 రెట్ల ఆస్తులను పెంచుకున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చేతికి వాచీ,వేలికి ఉంగరం లేదని చెప్పుకునే  నిరుపేద చంద్రబాబు ఆస్తులు ఈ ఐదేళ్లలో  భారీగా ఎందుకు, ఎలా పెరిగాయో వివరంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులు కట్టకుండానే  ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు, కమీషన్లు దండుకుని బాబు కుటుంబం ఆస్తులు అమాంతం పెంచుకుందని మండిపడ్డారు. సీఎం ఆస్తి సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని ఎనిమిదేళ్ల క్రితమే తెహల్కా పత్రిక పేర్కొందని గుర్తు చేశారు. 

శాంతియుతంగా సాగుతున్న జగన్‌
9 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుట్రలపై వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని, ఏ రోజైనా ఒక చిన్న  ఘటన కూడా ఈ రాష్ట్రంలో జరిగిందా అని ప్రశ్నించారు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా శాంతియుతంగానే పార్టీని నడిపిస్తున్నారన్నారు. చివరికి వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం  చేశారని, ఆయన చినాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నిందితులను కాపాడుతున్నారన్నారు. ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, అరాచకం సృష్టిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను బేఖాతర్‌ చేస్తున్నారని, ఓటమి భయంతో బాబు, ఆయన తాబేదారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారు చరిత్రలో పతనమవడం ఖాయమని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement