సీఎం రమేష్‌కు అంత సీన్‌ లేదు: వరదరాజులు రెడ్డి

TDP Leader Varadarajula Reddy Takes On CM Ramesh - Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ సీఎం రమేష్‌ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ.

నేరుగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. నామినేటెడ్‌ పదవులతో పబ్బం గడుపుకునే సీఎం రమేష్‌కు వర్గ రాజకీయాలు ఎందుకు?. కుందూ, పెన్నా వరద కాలువ విషయంలో సీఎం రమేష్‌ అయిదు శాతం కమిషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు.  దొంగ ఆస్తులను తనఖా పెట్టి వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాడు.’ అంటూ ఆరోపణలు గుప్పిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top