బీజేపీని గద్దెదించడమే ప్రధాన ఎజెండా
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, యాదాద్రి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడమే ప్రధాన ఎజెండాగా సీపీఎం పని చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏర్పడ్డ బీఎల్ఎఫ్ ద్వారా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లలో 60 సీట్లను బీఎల్ఎఫ్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. సీపీఎం మహాసభలకు సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఇందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నేత చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.