చంద్రబాబుది రక్తచరిత్ర | Sudhakar Babu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది రక్తచరిత్ర

Mar 18 2019 4:07 AM | Updated on Mar 18 2019 4:07 AM

Sudhakar Babu Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: నమ్ముకుంటే పేదలను కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చేది వైఎస్‌ కుటుంబమేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. విజయవాడ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే, నందిగం సురేష్‌కు లోక్‌సభ..ఇలా ఎంతోమంది పేదవారికి టికెట్‌ ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబుది రక్తచరిత్ర అని, ఎన్నికలొస్తుండడంతో ఆయన నిజస్వరూపం బట్టబయలౌతోందని విమర్శించారు. తన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనలేక హత్యారాజకీయాలకు చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు.

గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఆయన తండ్రి రాజారెడ్డిని హత్య చేయించారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేసుకోబోతున్న తరుణంలో ఆయన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయించారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేని చంద్రబాబునాయుడు ఘెరంగా వైఫల్యం చెందాడని అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చంద్రబాబు, ఆయన గ్యాంగ్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తన అక్రమాలకు అడ్డుగా ఉన్నారని అప్పట్లో వంగవీటి రంగా, పింగళి దశరథరామ్, ఇటీవల చెరుకులపాడు నారాయణరెడ్డి తదితరులను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

జగన్‌ సుపరిపాలన రాబోతోంది.. 
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన రాబోతోందని, మాజీ ఎంపీ హర్షకుమార్‌ కళ్లు తెరిచి మాట్లాడాలని సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయంటూ గతంలో ఆయనే ధ్వజమెత్తిన విషయాన్ని మరచిపోయినట్లు ఉన్నాడని తెలిపారు. వైఎస్‌ కుటుంబంపై ఆరోపణలు చేసి..టీడీపీ నుంచి  సీటు తెచ్చుకునే కుసంస్కృతి ఆయనకే చెల్లుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ చనిపోతున్నాడని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం హర్షకుమార్‌కు భావ్యం కాదని సుధాకర్‌బాబు హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement