బీజేపీపాలిత రాష్ట్రాల్లోనే మతకల్లోలాలు

Subhasini Ali Fires On BJP - Sakshi

కార్పొరేట్‌ శక్తులకు దాసోహమైన బీజేపీ

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ

కరీంనగర్‌: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మతకల్లోలాలు దళితుల పట్ల వివక్షత జరుగుతుందని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ విమర్శించారు. కళాభారతిలో సీపీఎం జిల్లా కమిటీ బుధవారం నిర్వహించిన ‘మతోన్మాదం–లౌకిక వాదానికి సవా ళ్లు’అనే సెమినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు. భారత స్వాతంత్య్ర ఉద్యమం నాటికి దేశంలో మతకల్లోలాలు లేవని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ దేశం కోసం పోరాడిన వారేనని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతకల్లోలాలు సృష్టిస్తూ దేశభక్తి ముసుగులో పబ్బం గడుపుతున్నారన్నారు. మహారాష్ట్ర, యుపీలో రైతుల సమస్యలను తుంగలో తొక్కి వారి ఆత్మహత్యలకు కారణమైందన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు  దళిత, ముస్లిం, రైతు వ్యతిరేక ప్రభుత్వాలే అన్నారు. కుల మతాలకు అతీతంగా సామాజిక పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.  బీజేపీని నిలువరించాల్సిన బాధ్యత లౌకిక శక్తులపై ఉందని అన్నారు. గోరక్షణ పేరుతో ముస్లిం, దళితులపై దాడులకు పాల్పడుతూ  భయానక వాతావరణం సృష్టిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వాదులపై ఉందన్నారు. సెమినార్‌లో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుడికందుల సత్యం, శ్రీనివాస్, ముస్లిం నేతలు వసీం అహ్మద్, క్రిస్టియన్‌ నేతలు క్రిష్టఫర్, లూయిస్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వరాల రవికుమార్, వాసుదేవరెడ్డి, భీమాసాహెబ్, భాగ్యలక్ష్మి, బండారి శేఖర్, సంపత్, రాజిరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top