యెడ్డీ సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం ఇది! | this is a strategy to stop Yeddyurappa Ji from becoming CM | Sakshi
Sakshi News home page

Mar 31 2018 11:50 AM | Updated on Sep 5 2018 1:55 PM

this is a strategy to stop Yeddyurappa Ji from becoming CM - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశం కీలకంగా మారింది. ప్రతిపక్ష బీజేపీని ఇరకాటంలో నెట్టేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పిస్తూ.. కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తద్వారా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది. కర్ణాటకలో లింగాయత్‌ల జనాభా 17శాతం ఉంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక సామాజికవర్గం కావడంతో కర్ణాటకలో లింగాయత్‌లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడుతున్నాయి.

లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా పేరొందిన బీఎస్‌ యడ్యూరప్ప మరోసారి బీజేపీ గూటికి చేరడంతో ఆ వర్గం మరోసారి కమలదళానికి మద్దతుగా నిలుస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో లింగాయత్‌ ఓటు బ్యాంకును చీల్చడానికే సిద్దరామయ్య సర్కారు మత మైనారిటీ హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇది నిజానికి ఇప్పటి తాజా సమస్య కాదు. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంశంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది.  ఈ అంశంపై ఇప్పుడే తమ వైఖరి వెల్లడించబోమని, ఎన్నికల తర్వాతే తమ వైఖరిని స్పష్టం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. యడ్యూరప్ప సీఎం కాకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ‘ఇది యెడ్డీని సీఎం కాకుండా అడ్డుకునే వ్యూహం. లింగాయత్‌ ఓట్లను విభజించాలని సిద్దరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. ఆ సంగతి లింగాయత్‌లకు తెలుసు. ఎన్నికల తర్వాతే బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేస్తుంది’ అని అమిత్‌ షా శనివారం మీడియాతో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement