
టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎంతగానో నలిగిపోయానని వెల్లడించారు.
సాక్షి, విజయవాడ: అవినీతి, దుర్మార్గాలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దిగజారాయని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యం, సారాస్వామ్యంగా మారిందని దుయ్యబట్టారు. శనివారం ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయనను జనసేన పార్టీలోకి సాదరంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. (చంద్రబాబుకు రావెల ఝలక్)
ఈ సందర్భంగా కిషోర్బాబు మాట్లాడుతూ.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక టీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎంతగానో నలిగిపోయానని వెల్లడించారు. టీడీపీలో పదవులు ఉంటాయి గానీ పవర్స్ ఉండవని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని చంపులేకపోయానని అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో సమిధగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు.
రావెల కిషోర్బాబును జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్
ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి: పవన్
విజయవాడ అంటేనే కుల రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ అని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన గొడవ వల్ల కుల రాజకీయాలు ఏర్పడ్డాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లి చూసిన కనీసం వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆడపడుచులను కొట్టే నాయకులు ఎమ్మెల్యేలు కావడంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దళితులను సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.