రైతులను నిర్లక్ష్యం చేస్తూ యాత్రలా?
కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఆదుకోకుండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ రాష్ట్రాలు తిరుగుతున్నారు.
ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నారు. నిర్మాణంలో ఉన్నప్పుడే డబుల్ బెడ్రూం ఇళ్లు కూలిపోతున్నాయంటే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం, అప్పుల ఊబిలో ఉన్న రైతుకు ఏ మూలకు సరిపోతుంది. ఈ పథకం రైతుబంధు కాదు, వడ్డీ బంధుగా మారనుంది’అని విమర్శించారు.