
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని హామీల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరెందుకు మెదపటం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు ఇప్పటికైనా కేంద్రాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. లేకుంటే కేసీఆర్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. విభజన అనంతరం కేంద్రం నుంచి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం రాహుల్తో లేఖ
ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోపు ఎస్సీ వర్గీకరణపై రాహుల్గాంధీతో లేఖ రాయించే ప్రయత్నం చేస్తానని ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ అంబర్పేటలోని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నివాసానికి వెళ్లి ఇటీవల వివాహమైన ఆయన కుమార్తె కృష్ణవేణి, పృధ్వీరాజ్ దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్గీకరణపై పార్లమెంటులో కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టాలని కోరుతూ మంద కృష్ణ వినతిపత్రం సమర్పించారు. భేటీలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ, మాదిగ మేధావుల సంఘం నేత బాబూరావు, రమేశ్ ఉన్నారు.