
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న 2019 లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికల అసలు-సిసలు సెమీఫైనల్ కానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఎన్నికల పోరు జరగనుంది. ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి మొత్తం 99 మంది లోక్సభ ఎంపీలు ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది జరగబోయే చాలా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉండనుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశమున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కమలదళానికి విజయం అంత సులువుగా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. రాజస్థాన్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల్లో అశాంతి, నిరుద్యోగ సమస్య, గుజ్జర్ల ఆందోళన బీజేపీ సర్కారును కుదిపేస్తున్నాయి. ఇటీవలి రాజస్థాన్ సర్వేలు కూడా బీజేపీకి ఏమంత పెద్దగా అనుకూలంగా రాలేదు. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో శివ్రాజ్సింగ్ చౌహాన్, రమణ్సింగ్లు నాలుగోసారి తమకు అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కొంత వ్యక్తమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశముంది.