చాయ్‌వాలాలను మర్చిపోతున్నారు

PM Now Remembering Chowkidars After Forgetting Chaiwalas - Sakshi

మోదీపై కపిల్‌ సిబల్‌ మండిపాటు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్‌లను గుర్తు చేసుకుంటూ తన తోటి చాయ్‌వాలాలను మర్చిపోతున్నారని, తదుపరి రాజకీయ ప్రయోజనాల కోసం మరొకరిని గుర్తు చేసుకుంటూ చౌకీదార్‌లను మర్చిపోతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ఎద్దేవా చేశారు. ప్రధాని ‘మై భీ చౌకీదార్‌’ ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందని ఆయన చెప్పారు. ‘గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరి, బారాముల్లా, పుల్వామాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు చౌకీదార్‌ (మోదీ) ఏం చేస్తున్నారు. నిద్రపోతున్నారా? అప్పుడు ‘మై భీ చౌకీదార్‌’ నినాదం ఏమైంది?’ అని కపిల్‌ సిబల్‌ పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడులను మోదీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘బీజేపీ బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా వైమానిక దాడులను రాజకీయం చేయడంలో ముందే ఉంటుంది. ప్రధాని ప్రసంగాలు ఇచ్చే సమయంలో వెనుక అమర వీరుల ఫొటోలుంటాయి. పదే పదే తన ప్రసంగాల్లో వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ప్రజల్లో కూడా అదే భావన ఉందంటున్నారు’ అని సిబల్‌ విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం, విద్య, ఆరోగ్యం, ఆకలి వంటి సగటు మనిషి జీవితానికి సంబంధించిన విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి కనీస ఆందోళన లేదని ఆరోపించారు. అలాగే నీరవ్‌ మోదీ, మొహుల్‌ చోక్సీ వంటి వారు దేశం విడిచి పారిపోయి నప్పుడు చౌకీదార్‌ ఉద్యమం ఏమైందని ఎద్దేవా చేశారు. ‘బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం తప్పేమీ కాదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే దాన్ని రాజకీయం చేయడమే సరికాదు’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top