తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!

 Motkupalli Narasimhulu Fires on CM Chandrababu - Sakshi

చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు ధ్వజం  

సాక్షి, యాదాద్రి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అని నిప్పులు చెరిగారు. ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి బుధవారం విలేకరులతో మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లేనని, వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతోంది వైఎస్‌ జగన్, పవన్ కల్యాణ్‌ అని, చంద్రబాబు కాదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కాపులకు, బీసీలకు, బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థలోని చీడ పురుగు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘నాకు మోకాళ్ళ నొప్పి ఉంది. అయినా కూడా తిరుపతి మెట్లు ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా’ అని మోత్కుపల్లి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top