
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న పలు అక్రమాలు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు వల్ల నష్టపోతున్న గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వ దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని విఙ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అదే విధంగా విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన.. ముఖ్యమంత్రికి ఏడు లేఖలు రాశారు.