
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లా డుతూ కేంద్రం కచ్చితంగా అనుకుని, పట్టుబట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చునన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు, వివిధ కారణాలతో పునర్విభజన జరిగే పరిస్థితి లేదన్నారు.
అసెంబ్లీ సీట్లను 2026 దాకా పెంచేది లేదని పునర్విభజన చట్టంలో ఉందని, దానికి లోబడి సీట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని వివరించారు. పార్లమెంటులో దీనికోసం సవరణ చేయాలని, ఆ సవరణ చేస్తే దేశం మొత్తానికి చుట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పుడా సమయం కూడా లేదన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బా కొట్టకపోతే ఆశ్చర్యపోవాలని, డబ్బా కొడితే అందులో ఆశ్చర్యం ఏముందని జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికంటే ముందుగా కలవడానికి వచ్చే పార్టీ ఎంఐఎం అని జానారెడ్డి పేర్కొన్నారు.
జానారెడ్డి చాంబర్లో వాస్తు మార్పులు
జానారెడ్డి చాంబర్లో గురువారం కొన్ని వాస్తు మార్పులను చేశారు. వాస్తుశాస్త్ర నిపుణులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు చేసిన సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్లో నిపుణురాలు అయిన కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి దగ్గరుండి ఈ మార్పులను చేయించారు. దక్షిణానికి అభిముఖంగా ఉన్న జానారెడ్డి కుర్చీని తూర్పునకు మార్చారు. జానారెడ్డికోసం వచ్చే ఎమ్మెల్యేలు, సందర్శకులకోసం ఏర్పాటు చేసిన కుర్చీలను కూడా మార్చారు.