‘చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలి’

Gorantla Madhav Fires On TDP - Sakshi

సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన నామినేషన్‌ అడ్డుకోవాలని కుట్ర పన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. టీడీపీ నేతలు తన వీఆర్‌ఎస్‌ ఆమోదానికి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ఎదుగుదలను సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సామాన్యుడైన తనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ వల్లే బీసీల అభ్యున్నతి సాధ్యమని అన్నారు. చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, రాజకీయాల్లోకి చేరే ఉద్దేశంతో మాధవ్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్నారు. మాధవ్‌ వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆయన వీఆర్‌ఎస్‌ ఆమోదం పొందకుండా ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్‌ కూడా పేర్కొంది. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రిబ్యునల్‌ తీర్పును సమర్థించింది. హిందూపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్‌, ఆయన భార్య సవిత సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top