ఆ ముగ్గురికీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

Published Thu, Nov 14 2019 4:37 AM

Gadikota Srikanth Reddy And Malladi Vishnu Comments On Atchannaidu And Nara Lokesh And Kuna Ravi Kumar - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అసెంబ్లీ స్పీకర్‌ స్థానానికి భంగం కలిగించేలా విమర్శలు చేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ ముగ్గురికీ సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ అసభ్య పదజాలంతో దూషించారన్నారు.

నారా లోకేశ్‌ కూడా లేఖల రూపంలో స్పీకర్‌ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా 25 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రభుత్వ, పార్టీ సమన్వయ సమావేశం అసెంబ్లీలోని వైఎస్సార్‌ సీఎల్‌పీ కార్యాలయంలో బుధవారం జరిగిందని వారు వివరించారు. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం, సెర్ప్‌ కార్యక్రమాల అమలుపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తోందన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రభుత్వ–పార్టీ సమన్వయ సమావేశంలో అన్ని శాఖలపైనా ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.  

చంద్రబాబుది కొంగ జపం.. దొంగ దీక్ష 
సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూడలేక ఈర్ష్య, దుగ్ధతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొంగ జపం, దొంగ దీక్షకు దిగుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు విమర్శించారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ కోసమేనని విమర్శించారు. 2 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశించారని, ఇందుకోసమే గురువారం నుంచి ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తామన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement