
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ నిధులు కేటాయించి.. వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాజా బిల్లు చట్టరూపం దాలిస్తే.. పరిశ్రమల్లోని ఉద్యోగాలు 75శాతం స్థానికులకే లభిస్తాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు.
ఇక, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కొనియాడారు. యువతకు వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యువతను ప్రోత్సహించలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లక్షలమంది ఇక్కడ పనిచేస్తున్నారని, స్థానికులకు తగిన నైపుణ్య శిక్షణ ఇస్తే.. వారికే స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. యువత కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న అద్భుత నిర్ణయం ఇదని కొనియాడారు. వైఎస్ జగన్ పాలన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనను గుర్తుకుతెస్తోందని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు.