కడప: తనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్రెడ్డి. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఏ తప్పు చేయని తనపై బురదజల్లారని విమర్శించారు. తాము అధికారంలో లేకపోయినా తమ జపమే చేస్తున్నారని, తాను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదన్నారు.
తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి విరమిస్తారా? అని సవాల్ చేశారు. టీడీపీ నేతలు ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ఎల్లో మీడియా మాత్రం వాటిపై స్పందించదని ఈ సందర్భంగా చురకలంటించారు రవీంద్రనాథ్రెడ్డి.
‘టీడీపీ వారు వందల ఎకరాలు ఆక్రమించుకుంటే దాని గురించి రాయరు. ఏ తప్పు చేయని మాపై మాత్రం బురద జల్లుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దోచుకుంటుంటే దాని గురించి పచ్చ పత్రికలు రాయడం లేదు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా?’ అని సవాల్ చేశారు.


