
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే టీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ‘మేం పెంచుతామన్న పెన్షన్లకు కేసీఆర్ ఇంకా 16 రూపాయలు ఎక్కువ పెంచారు. మేం ఆరు నెలల కిందటే మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. దానిని అమలు చేయడానికి ఆరు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అవుతుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు మాకు సాధ్యం కాకపోతే మీకెలా సాధ్యం అవుతుంది’ అని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
గత రుణమాఫీ నాలుగు విడతలుగా అమలు చేశారని, ఇప్పుడేమో మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ మాటలను, హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ కూటమి టికెట్లు పంపకాల అంశం కొలిక్కి వస్తుందన్నారు.