ఇంగ్లిష్‌పై బాబుది దారుణమైన విధానం: సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Slams Chandrababu Naidu Over English Medium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేదవాళ్లు ఇంగ్లిష్‌ నేర్చుకునే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దారుణమైన విధానాన్ని అవలంబిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఆనాడే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చామని చంద్రబాబు గొప్పలు చెప్తున్నారని, కానీ చంద్రబాబు హయాంలో 65శాతం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉంటే.. కేవలం 35శాతం ప్రభుత్వ బళ్లలోనే ఇంగ్లిష్‌ మీడియం ఉందని గుర్తు చేశారు. అదే తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకున్న నారాయణ ద్వారా అక్షరాల 94శాతం ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం పెట్టి..  ప్రభుత్వ బళ్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇది చంద్రబాబు విధానమని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాం అంశంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్‌ మాట్లాడారు.

ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు పాఠశాలలకు పోటీపడే పరిస్థితి రావాలని, ఇంగ్లిష్‌ను ప్రతి ఒక్కరూ హక్కుగా నేర్చుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏం చేసినా చంద్రబాబుకు రాజకీయమే కనిపిస్తోందని, వక్రీకరణే కనిపిస్తోందని మండిపడ్డారు. సాక్షిలో వచ్చిన ఓ కథనాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లిష్‌ మీడియం గురించి నిర్ణయం తీసుకుంటే.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌ మీడియం విషయంలో చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం అంశంపై రేపు (గురువారం) సుదీర్ఘంగా సభలో చర్చించుకుందామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top