కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతోంది!
17న హుజుర్ నగర్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
సాక్షి, హుజూర్నగర్: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న (గురువారం) హుజూర్ నగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్నగర్ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాజేశ్వర్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
సబ్బండ వర్గాల ప్రజలు ఎవరికీ వారు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ సభ కాబోతున్నదని అన్నారు. హుజూర్నగర్ ప్రజల అదృష్టం బాగుందని, వారు ఈ ఉప ఎన్నికలో అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు, రెవెన్యూ డివిజన్ సమస్యకు టీఆర్శ్రీస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందని చెప్పారు.