ఎన్నికల ‘కోడ్’కు సీఎం పాతర
నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగం
నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన
చిత్తూరు జిల్లా పలమనేరు ఎన్నికల సభలో బాబు
ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్న ప్రజాస్వామ్యవాదులు
చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా, యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వివిధ పథకాలు, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఎన్నికల నియమావళిని అపహాస్యం చేశారు. సీఎం చంద్రబాబు ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో ఆయన మాట్లా డుతూ ‘పలమనేరుకు రెవెన్యూ డివిజన్ను శాంక్షన్ చేస్తున్నాను. పెద్ద చెరువు సుందరీకరణకు రూ.25 కోట్లు కావాలి. అది కూడా మంజూరు చేస్తున్నాను. క్రిస్టియన్స్కు చర్చికి రూ.2 కోట్లు కావాలి. అది కూడా మంజూరు చేస్తాం. క్యాటిల్ఫాం దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను, కోల్డ్ స్టోరేజ్ను రూ.20 కోట్లతో శాంక్షన్ చేస్తున్నాం. గంగమ్మ శిరస్సు ప్రాజెక్టు రూ.35 కోట్లతో పూర్తిచేసి పలమనేరు టౌన్కు 24 గంటలూ నీటిని సరఫరా చేస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచార సభలో ఓటర్లను ప్రలోభ పెట్టేలా ప్రకటనలు చేయడం నియమావళిని ఉల్లంఘించడమేనని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి, స్టార్ క్యాంపెయినర్లు నిర్వహించే ప్రచారం, కదలికలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నిఘా ఉంచాలి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు భావిస్తే నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలి. గత ఎన్నికల వరకు పలువురు ముఖ్యమంత్రులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడాన్ని అధికారవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆదివారం సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం పలు టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రసంగాన్ని పరిశీలిస్తే సీఎం చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేటతెల్లమవుతుందని, దీన్ని సుమోటోగా భావించి ఎన్నికల సంఘం తక్షణమే నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటే ఇకపైనైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.
యథేచ్ఛగా మద్యం పంపిణీ
ఒక వైపు సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తెలుగు తమ్ముళ్లు వైన్ షాపుల దగ్గర బారులు తీరారు. వైన్ షాపు ముందరే తాగుతూ పాదచారులకు ఇబ్బందులు కల్పించారు. వీరందరికీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆర్మీ (ఎన్ఏఆర్) మందు సరఫరా చేసింది. అది చాలకపోవడంతో పక్కనే ఉన్న వైన్ షాపు దగ్గరికి పిలుచుకుని వచ్చి మత్తులో ఊగేట్టు చేశారు. కొంతమంది సభాస్థలంలోనే పడిపోయారు.