
సాక్షి, కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వార్ధ రాజకీయాలతో ఆ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. కేసీఆర్ హామీలు అమలుకు నోచుకోని వైనంపై మిలిటెంట్ ఉద్యమం చేపడతామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణలో విఫలమయ్యారని విమర్శించారు. జూలై, ఆగస్టులలో ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములు ప్రజల అవసరాలకు వినియోగించాలే తప్ప స్వార్ధ రాజకీయాలతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించబోమని చాడ హెచ్చరించారు.