ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయ్: లక్ష్మణ్‌

BJP Laxman Slams On Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రజలకు, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను చూసి ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ  సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిసేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వంద ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ కనీసం విలువలు పాటించడం లేదని విమర్శించారు. 

సైనికులకు మనో నిబ్బరం ఇవ్వాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 2014 లో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ రాఫెల్‌ డీల్‌ ఎందుకు ఫైనల్ చెయ్యలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయంలో బ్రోకర్లతో మాత్రమే కొనుగోలు ఉండేదని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు కుట్ర పూరిత పొత్తు పెట్టుకున్నారు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో జరిగిన  ఎన్నికలు చంద్రబాబు వెర్సస్ కేసీఆర్ అన్నట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహించడం‍లో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్క క్షమాపణతో ఎన్నికల కమిషన్‌ తమ తప్పును తుడిచేసుకుందని విమర్శించారు. తాము ఓటమి మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తామన్నారు. వచ్చే లోక్ ​సభ ఎన్నికల కోసం పార్టీ సిద్ధం అవుతుందని లక్ష్మణ్‌ తెలిపారు. జనవరి 11, 12  ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహం రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు స్వయంగా సమీక్ష చేస్తారని చెప్పారు. 

2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు బీజేపీకి వచ్చాయని,ఈ సారి 30 కోట్ల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఓటమితో కార్యకర్తలు అధైర్య పడవద్దని లోపాలు సరిదిద్దుకొని ముందుకు పోవాలి సూచించారు. 2019 వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీని ప్రభుత్వాన్ని తీసుకురావడామే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు ప్రజలకు తెలుసునన్నారు.

కుమార పట్టాభిషేకం ..ఇప్పుడిప్పుడే కదా అయింది కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం మీద స్పందిస్తాం. ఈవీఎంల సాంకేతిక మీద మా అభ్యర్థులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానిపై ఒక కమిటీ వేస్తామని చెప్పారు. తెరాస సెంటిమెంట్‌తో గట్టెక్కిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాని కన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వచ్చింది. సెంటిమెంట్‌తో మాకు రావాల్సిన ఓట్లు కూడా తెరాసకు వెళ్లాయని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top