అభివృద్ధి రాగం | Sakshi
Sakshi News home page

అభివృద్ధి రాగం

Published Fri, Mar 29 2019 9:07 AM

Bangaru Sruthi Special Interview on Lok Sabha Election - Sakshi

నాగర్‌కర్నూల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్నారు నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం 1952లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు, లీడర్లు మారినా అభివృద్ధికి నోచుకోలేదు. ఎంపీగా గెలిపిస్తే  నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా’నని చెబుతోన్న బంగారు శ్రుతి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడతారు. ‘సాక్షి’తో పంచుకున్న భావాలివీ..

ఏం చేయాలో తెలుసుకున్నాను
నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. పార్టీ మేనిఫెస్టోతో సరిపెట్టుకోకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాను. సమస్యలు తెలిశాయి, వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాను. అడవులు ఎక్కువగా ఉన్న నల్లమల ప్రాంతంలో పేపర్‌ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తాను.

బంగారు శ్రుతి
స్వగ్రామం:  హైదరాబాద్‌
తండ్రి:  బంగారు లక్ష్మణ్‌ (బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు)
తల్లి: బంగారు సుశీల(మాజీ ఎంపీ)
విద్యార్హత: ఎం.టెక్, ఎంబీఏ(ఆస్ట్రేలియా)
రాజకీయ అనుభవం: 2006 నుంచి బీజేపీలో యాక్టివ్‌మెంబర్‌. 2012 నుంచి బీజేపీ నేషనల్‌ మెంబర్, ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి(రాజకీయాల్లోకి రాకముందు 15ఏళ్లు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో క్వాలిటీ ఇంజనీర్‌గా ఉద్యోగం).

యువతకు నైపుణ్యాభివృద్ధి
స్కిల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాను. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్‌ కళాశాలలు నెలకొల్పడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాను. మహిళల స్వయం సమృద్ధి సాధనకు కృషి చేస్తా.– రాజు,సాక్షి– నాగర్‌కర్నూలు

Advertisement
Advertisement