బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు: వైఎస్సార్‌సీపీ | Babu does not have Integrity on special staus | Sakshi
Sakshi News home page

బాబుకు హోదాపై చిత్తశుద్ధి లేదు: వైఎస్సార్‌సీపీ

Apr 3 2018 1:38 PM | Updated on Oct 16 2018 6:01 PM

Babu does not have Integrity on special staus - Sakshi

దీక్షలో పాల్గొన్న ముస్లిం మైనార్టీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు

విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి, మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారథి వ్యాఖ్యానించారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్థసారధి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా కోసం పోరాడే ప్రతి సంస్ధకు వైఎస్ఆర్సీపీ మద్ధుతు ఇచ్చిందని తెలిపారు. పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధపడిందని వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబుకు హోదాపై పోరాడే ధైర్యం ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. కేంద్రం ముందు చంద్రబాబు సాగిలపడుతున్నారని, కేంద్రం మోసం చేసిందంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వడానికి వీలులేదన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అని సూటిగా ప్రశ్నించారు.

‘పదకొండు రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తామని కేంద్రం చెప్పినప్పుడు చంద్రబాబు ఏం చేశారు? అవిశ్వాసం పెడదామంటే..ఏం ఒరుగుతుందని చంద్రబాబు అనలేదా? రాజీనామాలు చేద్దామంటే...మీరెందుకు ముందుకు రారు.’ అని అన్నారు. బీజేపీతో కలవాల్సిన అవసరం వైఎస్ఆర్‌సీపీకి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్‌ అప్పారావు, రక్షణనిధి కూడా పాల్గొన్నారు.

మేకా ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో వున్న చంద్రబాబుకు మాత్రం ప్రత్యేక హోదా పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడమీద పిల్లిలా రాజకీయ పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నం  చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో పోరాటం చేయటంలేదని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయ లబ్దిపొందారని, ఇప్పుడు అవసరం తీరగానే బీజేపీని వదిలి కొత్త మిత్రులను వెతుక్కుంటున్నారని విమర్శించారు. అటువంటి చంద్రబాబుకు, వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత లేదన్నారు. ఇంకా బీజేపీతో చంద్రబాబు లాలూచీ నడుస్తోందని, ఎంపీలతో రాజీనామా చేయమని ప్రజలు కోరుతుంటే..చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 
చంద్రబాబు మాటలను మైనారిటీలే కాదు..ఏ వర్గం కూడా నమ్మేపరిస్థితి లేదని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రక్షణ నిథి మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ హోదా కోసం చేస్తున్న పోరాటం చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ప్రలోభాలు పెట్టారని, మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్‌కు చివరికి దక్కింది వక్ఫ్ బోర్డు పదవి అని, చంద్రబాబు మోసాలు ఇలాగే ఉంటాయని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement