ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న కేంద్రం
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
నిజామాబాద్ కల్చరల్ (నిజామాబాద్ అర్బన్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని హైదరాబాద్ ఎంపీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును దేశంలోని ముస్లింలంతా తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ఈద్గా వద్ద శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం పర్సనల్ లాలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారని, అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు యత్నించడం సరికాదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.