న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించిన జేపీ నడ్డా ఈరోజు అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడు కావడం సంతోషకరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్నాళ్లు పార్టీ చీఫ్గా వ్యవహరించిన అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ... ఇతర పార్టీల మాదిరి తమ పార్టీలో బంధుప్రీతి ఉండదని వ్యాఖ్యానించారు.
‘‘ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఒకే కుటుంబం కేంద్రంగా.. వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి. తమ సొంతవారికి పదోన్నతులు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇందుకు మినహాయింపు. ప్రతీ కార్యకర్తను ప్రోత్సహిస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతుంది. కులం, బంధుత్వంతో సంబంధం లేదు. మాతృభూమి రక్షణపై పాటుపడేవాళ్లకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం నడ్డా మా పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఆయన నేతృత్వంలో మరిన్ని విజయాలు సాధిస్తుంది అని అమిత్ షా ఆకాంక్షించారు. (బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం)