సమస్యలతో స్టాఫ్ నర్సుల సతమతం | Staff Nurses ruled out due to problems | Sakshi
Sakshi News home page

సమస్యలతో స్టాఫ్ నర్సుల సతమతం

Mar 12 2015 12:40 AM | Updated on Sep 2 2017 10:40 PM

అందరికీ ఆరోగ్యాన్ని అందించే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.

అసహాయస్థితిలో చేరినప్పుడు అమ్మలా... అక్కలా ఆదరించి అసహ్యిం చుకోకుండా సేవలు చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ బ్యాంకు సూచన మేరకు ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను మూడు విభాగాలుగా విభజించడంతో స్టాఫ్ నర్సుల సీనియారిటీ, పదోన్నతులు, భద్రత, భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 20, 30 ఏళ్లుగా పని చేసినా పదోన్నతులు రాక చాలా మంది పదవీ విరమణ పొందారు. పోరాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలోనైనా తమ బాధలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు, డిమాండ్లు పరి ష్కారమవుతాయే మోనన్న గంపెడాశతో సేవాభావమే వృత్తి ధర్మం గల నర్సులందరూ ఎదురు చూస్తున్నారు.
 
స్టాఫ్ నర్సులలో 1. స్టాఫ్‌నర్సు 2. హెడ్ నర్సు, 3. గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ 4. గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ 5. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ నర్సింగ్ కేటగిరీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో దాదాపు 16 వేల మంది నర్సులుగా పనిచేస్తుండగా, సుమారు 8,600 పోస్టు లు వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు, ఏఎన్ ఎంలు 12,522 మంది గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదు.

ఖాళీలు భర్తీ చేయకపోవడం వలన నలుగురి పనిని ఒక్కరే చేస్తూ షిష్ట్ అయిన వెంటనే బయటపడే పరిస్థితి ఉండటం లేదు. నైట్ డ్యూటీలు చేస్తున్న నర్సులకు సెక్యూరిటీ ఉండదు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ వైద్యశాలల్లో నర్సులకు దుస్తులు మార్చుకోవడానికి రూములు గానీ ప్రత్యేకంగా టాయ్‌లెట్స్, విశ్రాంతి గదుల్లాంటివి లేవు. కాబట్టి అఖిల భారత సంస్థల్లో మాదిరిగా నర్సింగ్ కేడర్‌లకు స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెం డెంట్, చీఫ్ నర్సింగ్ అధికారిణి, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ నర్సింగ్, జాయింట్ డెరైక్టర్‌గా వివిధ కేడర్ పోస్టులను సృష్టించి, కేంద్రం ఇస్తున్న వేతనాల మాదిరిగా రాష్ట్రం కూడా ఇవ్వాలి.

నగరాల్లో అద్దె ఇళ్లు దొరక్క, దొరికినా వేలల్లో భరించలేని కిరాయిలతో ఇబ్బందులు పడుతున్నందున, ప్రభుత్వపరంగా గృహాలు నిర్మించి ఇవ్వాలి. నర్సులను ప్రోత్సహిస్తూ గతంలో జాతీయ అవార్డులు ఇచ్చేవారు. ఆగిపోయిన ఈ సంప్రదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న నర్సులకు ట్రైబల్ అలవెన్సులు, అత్యవసర పరిస్థితుల్లో, వరదలు, విషరోగాలు, తదితరాల్లో పనిచేసే నర్సులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి. యూనిఫాం అలవెన్సు కింద రూ.24 వేలు ఇవ్వాలి. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు సైతం మెరుగైన వేత నాలు అందేటట్లు చూడాలి.
 
హరి అశోక్‌కుమార్  గౌరవాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల ఐకాస, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement