పంట భూముల నుండి రైతులను గెంటేయవద్దు | Don't full the farmers from croplands | Sakshi
Sakshi News home page

పంట భూముల నుండి రైతులను గెంటేయవద్దు

Dec 31 2014 1:05 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం పేరిట ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్నదంతా దాని సాకున నల్లధన కుబేరుల జూదగొండి ప్రయోజనాలను కాపాడటమేనని రచయితలమూ, ఆలోచనాపరుల మూ అయిన మేము బలంగా అభిప్రాయపడుతున్నాం.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం పేరిట ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్నదంతా దాని సాకున నల్లధన కుబేరుల జూదగొండి ప్రయోజనాలను కాపాడటమేనని రచయితలమూ, ఆలోచనాపరుల మూ అయిన మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ప్రపంచాన్ని తలదన్నేంత మహోన్నత రాజధానిని నిర్మాణం చేయమని రాష్ట్ర ప్రజలు పాలకులను ఆదేశించలేదు. చంద్రబాబు తరహాలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి, ప్రజానుకూల నమూనా కాదు. దాని వైఫల్యాలను చరిత్ర నమోదు చేసింది.
 
 రాజధాని కనీస అవసరాలైన పాలనా భవనాలు, గృహ సముదాయాల కోసం కొన్ని వందల ఎకరాల భూమి ఉంటే చాలు. 30 వేలు- లక్ష ఎకరాలు సమీ కరించటమన్నది దేశ విదేశీ ధనస్వాముల దోపిడీ ప్రయోజనాల కోసమే తప్ప సాధారణ ప్రజల లబ్ధి కోసం కాదని మా అభిప్రాయం. రాజధానికి అవసరమైన ప్రభుత్వ భూములు నిర్దేశిత ప్రాంతంలో ఉన్నాయి. అదనంగా రైతుల భూములను సమీకరించనక్కరలేదు. ముక్కారు పంటలు పండే పొలాలను కాంక్రీటు వనాలుగా మార్చనక్కరలేదు. తరతరాలుగా అక్కడ జీవిస్తున్న వేలాది కుటుంబా లను వలస జీవులుగా గెంటివేయనక్కరలేదు.
 
 మన దేశానికి ఆయువుపట్టు లాంటి గ్రామీణ జీవనంలో డబ్బుకు మించిన, అది కొనుగోలు చేయలేని సాంస్కృతిక ఔన్నత్యం ఒకటుంది. ఒక కుటుంబమంటే తల్లీ, తండ్రీ; భార్యా, భర్తా, పిల్లలు ఎలాగో గ్రామం అంటే ‘భూ మి, నారు, పశువు, పాడి, పంట, అనేక కుటుంబాల’ ఆత్మిక కలయిక. వారి జీవన విధ్వంస మంటే సాంస్కృతిక విధ్వంసం కూడానని మేము భావిస్తున్నాం. రాజధాని ప్రదేశం ఎంపికకు వాస్తు మౌఢ్యాన్ని అడ్డు పెట్టుకోవడాన్ని మేము అసహ్యిం చుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తికి కొరతను తెచ్చి, విదేశాల నుండి వాటిని దిగుమతి చేసుకోవా ల్సిన దుస్థితికి దేశాన్నీ, రాష్ట్రాన్నీ దిగజార్చే విధంగా, వేలాది ఎకరాల పంటభూముల్ని రాజధాని నిర్మా ణం కోసం సమీకరించే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, చర్యలను మేము ఖండిస్తున్నాం.
 
 సాధారణ పరిపాలనా రాజధానిని ప్రభుత్వ భూముల్లో, పంటలు పండని భూముల్లో నిర్మించా లని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల వాస్తవిక సమస్యలైన ఆత్మహత్యలు, అధిక ధరలు, నిరుద్యోగం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, రైతాంగానికి గిట్టుబాటు ధరలు, శ్రామికులకు కనీస వేతన చట్టాలూ, మహి ళలూ, దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష, భాషా-సాంస్కృతిక వికాసం వంటి సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పనిచేయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రచయితలుగా, ఆలోచనాపరులుగా విజ్ఞప్తి చేస్తున్నాం.
 
 కె. రవిబాబు, దివికుమార్, సి.వి. చలసాని ప్రసాద్, నిర్మలానంద, శీలా వీర్రాజు, వరవరరావు, డా. ఎస్వీ సత్యనారాయణ, వరలక్ష్మి, వేల్పుల నారా యణ, వల్లూరి శివప్రసాద్, పెద్దిబొట్ల సుబ్బరామ య్య, అద్దేపల్లి రామమోహనరావు, అంపశయ్య నవీన్, కె.శివారెడ్డి, కడియాల రామమోహనరాయ్, సింగమనేని నారాయణ, బి. సూర్యసాగర్, పెను గొండ లక్ష్మీనారాయణ, కాత్యాయనీ విద్మహే, రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి, భూపాల్, పి.సత్యవతి, నలిమెల భాస్కర్, ముత్తేవి రవీంద్రనాథ్, దర్భ శయనం శ్రీనివాసాచార్య, పి.ఎస్. నాగరాజు, ఎన్ వేణుగోపాల్, నండూరి రాజగోపాల్, వి.వి.న. మూర్తి, కొల్లూరి, సింగంపల్లి, అశోక్‌కుమార్, బెం దాళం కృష్ణారావు, అల్లంశెట్టి చంద్రశేఖర్, ఖాదర్ మొహియుద్దీన్, చెరుకూరి సత్యనారాయణ ఇంకా కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, శ్రీకాకుళం, విశా ఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వరంగల్, ఖమ్మం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూ రు, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు, కర్నాటక రాష్ట్రానికి చెందిన 150 మంది రచయితలు.

Advertisement
 
Advertisement
Advertisement