ఆడవారిదే ‘ఆయువు’పట్టు

World Health Organisation Released Report On Lifetime - Sakshi

ప్రపంచంలో మగవాళ్ల కంటే ఆడవాళ్ల జీవితకాలమే ఎక్కువ

2019 ఆరోగ్య గణాంకాల నివేదిక

విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత్‌లో మహిళల సగటు జీవిత కాలం 70.3 ఏళ్లు

 పురుషులది 67.4 ఏళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో మగవారి ఆయుర్దాయం కంటే ఆడవారిదే ఎక్కువని తేలింది. మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక– 2019ను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రజల జీవిత కాలాన్ని, ఆరోగ్య రంగంలో ఆయా దేశాల స్థానాన్ని విశ్లేషించిం ది. ప్రపంచంలో సరాసరి మహిళలు 74.2 ఏళ్లు జీవి స్తుండగా, మగవారు 69.8 ఏళ్లు బతుకుతున్నారని పేర్కొంది. అయితే అదనంగా మహిళలు బతికే 4.4 ఏళ్లు కూడా ఒంటరితనం, పేదరికం, వ్యాధులతోనే కాలం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అదే భారత్‌లో పురుషులు సరాసరి 67.4 ఏళ్లు, మహి ళలు 70.3 ఏళ్లు బతుకుతున్నారని తేల్చింది. అంటే 2.9 ఏళ్లు అధికంగా మహిళల జీవితకాలం ఉంది. జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు 87.1 ఏళ్లు, పురుషులు 81.1 ఏళ్లు బతుకుతున్నారు.

18 ఏళ్ల ఆయుర్దాయ వ్యత్యాసం..
ఇక ప్రపంచంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుర్దాయం తగ్గడానికి ఏదో ఒకట్రెండు కారణాలు అనుకోలేమని, 40 ప్రధాన కారణాలున్నాయని విశ్లేషిం చింది. అందులో 33 కారణాలు అధికంగా దోహదం చేస్తాయని పేర్కొంది. గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్, టీబీ, రోడ్డు ప్రమాదాలు వంటివి ఉన్నాయి. ఇక తక్కువ ఆదాయం కల దేశాల్లో పుట్టినవారి ఆయుర్దాయం 62.7 ఏళ్లు కాగా, అధికాదాయ దేశాల ప్రజల ఆయుర్దాయం మాత్రం ఏకంగా 80.8 ఏళ్లు. అంటే అధికాదాయ దేశాల కంటే అల్పాదాయ దేశాల ప్రజల ఆయుర్దాయం 18.1 సంవత్సరాలు తక్కువ. ఈ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉండటం గమనార్హం. తక్కువ ఆదాయం గల దేశాల్లో ఆయుర్దాయం తక్కువ ఉండటానికి 10 ప్రధాన కారణాలు ప్రత్యేకంగా ఉన్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆయుర్దాయం 2.09 ఏళ్లు తగ్గింది. అతిసార వ్యాధులతో 1.97 ఏళ్లు, గుండెపోట్లతో 1.45 ఏళ్లు, ఎయిడ్స్‌తో 1.45 ఏళ్లు, టీబీతో 1.35 సంవత్సరాలు, గుండె జబ్బులతో 1.35 ఏళ్లు, మలేరియాతో 10 నెలలు, రోడ్డు ప్రమాదాలతో ఏడున్నర నెలలు, పోషకాహార లోపంతో 6 నెలలు, ఇతరత్రా కారణాలతో మరో ఏడాదిన్నర ఆయుర్దాయం తగ్గుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2016లో మధుమేహం, గుండెపోటు, కిడ్నీ, కేన్సర్‌ తదితర వ్యాధుల కారణంగా 4.10 కోట్ల మంది చనిపోయారు. అంటే మొత్తం ప్రపంచంలో ఆ ఏడాది చనిపోయినవారిలో ఈ సంఖ్య ఏకంగా 71 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

పట్టణాల్లో పది మందిలో ఒకరికి కాలుష్యం కాటు..
పట్టణాలు, నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరు వాయు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాయుకాలుష్యం కారణంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్, ఇతర శ్వాసకోశ వ్యాధులు రావడానికి ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వంటి కారణాల వల్ల 2016లో ఏకంగా 70 లక్షల మంది చనిపోయారు. ఇక పరిశుభ్రమైన తాగునీటిని వాడుతున్న ప్రజల శాతం పెరిగింది. 2015లో 71 శాతం మంది ప్రజలు పరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 2016లో పారిశుద్ధ్యలోపం, అపరిశుభ్రమైన నీటివల్ల 9 లక్షల మంది చనిపోయారని తెలిపింది. అందులో ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియా కారణంగా 4.70 లక్షల మంది చనిపోయారు. 

80.80 కోట్ల మంది 10 శాతానికి పైగా ఖర్చు
ప్రపంచంలో సగం జనాభాకు అత్యవసర వైద్య సేవలే అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీరికి తప్పనిసరిగా వైద్యం అందాల్సిన అవసరముందని చెప్పింది. ప్రపంచంలోని జనాభాలో 80.80 కోట్ల మంది తమ ఇంటి ఖర్చులో 10 శాతం పైగా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. తమ ఇంటి ఖర్చులో వైద్యానికి అధికంగా ఖర్చు చేసిన ఫలితంగా 2010లో ఏకంగా 9.70 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చింది. అంటే వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం వంటి పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ మందుల కొనుగోళ్లకే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది వేల మందికి 15 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. షుగర్, బీపీ, గుండె, కిడ్నీ సంబంధింత వ్యాధులకు థాయ్‌లాండ్‌ కంటే కూడా భారత్‌లో యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ ఎక్కువగా లేకపోవడం గమనార్హం. శ్రీలంకలో 62 శాతం జనాభాకు యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ అందుతుండగా, దేశంలో కేవలం 56 శాతం మందికే అందుతోంది. గర్భిణిలు ఆసుపత్రికి వస్తే ప్రసవం చేయడానికి నిపుణులైన వైద్య సిబ్బంది ఉండటం లేదు. దీనివల్ల మాతా శిశుమరణాలు అధికంగా సంభవిస్తున్నాయని తెలిపింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ అందుబాటులోకి వస్తేనే ప్రజల ఆరోగ్య ప్రమాణాలు, ఆయుర్దాయం పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది.

దేశంలో ఆరోగ్య స్థితిగతులు..
–భారత్‌లో 17.3 శాతం మంది తమ ఇంటి ఖర్చులో 10 శాతానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. 3.9 శాతం మంది 25 శాతం పైగా ఖర్చు చేస్తున్నారు. 
–ప్రతీ 10 వేల మంది జనాభాకు 7.8 మంది డాక్టర్లుండగా, నర్సులు 21.1 మంది ఉన్నారు. 
–ప్రతీ లక్ష మందిలో 204 మందికి క్షయ వ్యాధి ఉంది. 
–ప్రతీ వెయ్యి మందిలో 7.7 మందికి మలేరియా వచ్చే ప్రమాదముంది. 
–మద్యం, పొగాకు తాగడం వంటి కారణాల వల్ల దేశంలో గుండె జబ్బులు, కేన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మద్యం, పొగాకును పురుషులు ఎక్కువగా బానిసలవుతున్నారు
.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top