
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, దాదాపు 45 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.
రొయ్యల ఫ్రై, నెల్లూరు చేపల కూర, ఆంధ్రా చికెన్, పలు చట్నీలు, స్వీట్లు సహా పలు రుచికర ఆంధ్రా వంటకాలను ఈ విందులో వడ్డించారు. కేంద్ర మంత్రుల్లో రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, స్మృతి ఇరానీ, విపక్ష నేతల్లో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కణిమొళి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.
16న ఉప ఎన్నిక
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నవంబర్ 16న ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నవంబర్ 6 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.