మాస్క్లు ధరించకపోతే జరిమానా
పట్టణాల్లో రూ.1000.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.500
కలెక్టర్ విజయ్అమృత కులంగా
ఒడిశా, బరంపురం: ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా దేశాలన్నీ పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో లాక్డౌన్ విధించారు. దీంతో చాలాచోట్ల రవాణా స్తంభించిపోగా ప్రజల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. కరోనా నివారణకు తగిన వ్యాక్సిన్ లేకపోవడంతో ఇంటి పట్టునే ఉండి ప్రాణాలు రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్, షట్డౌన్ నిబంధనలు అమలుచేస్తూ ప్రజలను బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం మార్కెట్కు వచ్చేవారు కూడా సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి.
కలెక్టర్ విజయ్అమృత కులంగా
అయితే అలా వచ్చిన వారు కూడా తప్పకుండా మాస్కులు ధరించి బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మాస్కులు ధరించకుండా వచ్చిన వారిపై జరిమానా విధిస్తామని కలెక్టర్ విజయ్అమృత కులంగా ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.