దేశంలో ప్రతి సాగుభూమికీ నీరు | The country role of water in each cultivation | Sakshi
Sakshi News home page

దేశంలో ప్రతి సాగుభూమికీ నీరు

Jun 15 2014 1:25 AM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవసాయానికి మరింత ఊతమిచ్చే దిశగా దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి గ్రామ సించాయీ యోజన’ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలో ప్రధానమంత్రి గ్రామ సించాయీ యోజన ప్రారంభం

పాట్నా: వ్యవసాయానికి మరింత ఊతమిచ్చే దిశగా దేశవ్యాప్తంగా ‘ప్రధాన మంత్రి గ్రామ సించాయీ యోజన’ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘దేశంలోని ప్రతి పంట భూమికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే ఈ సించాయీ యోజన(సాగునీటి పథకం) ప్రవేశపెడుతున్నాం. సాగునీరు అందుబాటులో లేకపోతే వ్యవసాయ దిగుబడులు పెంచడం సాధ్యంకాదు. పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ప్రణాళిక రచిస్తున్నాం’’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ శనివారమిక్కడ చెప్పారు. ‘‘భూసారాన్ని బట్టి కూడా దిగుబడులు ఆధారపడి ఉంటాయి.

భూమి సారవంతమైనదైతే అత్యధిక దిగుబడులు సాధించడం సాధ్యమే. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులుకు ఈ పథకం కింద త్వరలోనే భూ సార కార్డులు జారీచేయనుంది. భూ సారాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల సాయం తీసుకుంటాం’’ అని వివరించారు. భూసారాన్ని బట్టి ఆ భూమిలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడం ద్వారా రైతుకు తోడ్పడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలోని 14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమిలో 44 శాతానికే సాగునీరు అందుతోంది. మిగతా చోట్ల వర్షాలే ఆధారం.
 

Advertisement
 
Advertisement
Advertisement