భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర | Sakshi
Sakshi News home page

భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

Published Sat, Feb 1 2020 11:56 AM

Terrorists Killed In Jammu Planned Major Attack - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నించి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఉగ్రవాదులు భారత్‌లో భారీ దాడికి కుట్రపన్నారని పోలీసులు పేర్కొన్నారు. దాడుల కోసం పెద్దమొత్తంలో బాంబులు, మార్ఫిన్‌ ఇంజెక్షన్లు, ఎల్‌ఈడీలు, బుల్లెట్‌ జాకెట్లు పాకిస్తాన్‌ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. రహదారి వెంబడి దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉన్న భద్రతా దళాల శిబిరాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు వేశారని..వారి కుట్రను గట్టిగా తిప్పి కొట్టామని పేర్కొన్నారు.  

కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ వ్యానులో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగడంతో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వ్యాను డ్రైవర్‌ సమీన్‌ దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్‌, గ్రెనెడ్లను, రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులుద జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారని, సముద్రంగా గుండా భారత్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆర్టికల్‌ 370రద్దు తర్వాత తొలిసారిగా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement