
తల్లి చూస్తుండగానే ఓ యువతిని కాల్చేశాడు..!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి చూస్తుండగానే ఓ యువతిని ఆమె స్నేహితుడే తుపాకీతో కాల్చి హత్యచేశాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తల్లి చూస్తుండగానే ఓ యువతిని ఆమె స్నేహితుడే తుపాకీతో కాల్చి హత్యచేశాడు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక నజఫ్ గఢ్కు చెందిన పదిహేడేళ్ల యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. షాపింగ్ ముగించుకున్న తర్వాత ఇద్దరు యువకులు(ఆమె ఫ్రెండ్స్) ఆ యువతిని తమ మెర్సిడేజ్ కారులో ఇంటివద్ద డ్రాప్ చేశారు. అయితే ఇంటి ముందే ఆ యువకులతో మాట్లాడుతూ ఉంది. షాపింగ్కు వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది.
అదే సమయంలో.. తన కూతురితో పాటుగా ఉన్న ఇద్దరు స్నేహితులలో ఒక యువకుడు ఇంటి ముందు మెర్సిడేజ్ కారు నుంచి కారు నుంచి దిగి వెళ్లిపోగా, మరో యువకుడు కారులో ఉన్నాడని చెప్పారు. కొన్ని క్షణాల తర్వాత ఆమె గమనిస్తుండగానే తుపాకీతో కాల్చినట్లుగా శబ్ధం వచ్చిందని, ఆ సౌండ్ విన్న వెంటనే కారు వద్దకు పరుగున వెళ్లి చూడగా తన కూతురు రక్తపు మడుగులో పడి ఉందని కన్నీటి పర్యంతమయింది. చివరగా రాత్రి ఏడున్నర గంటలకు కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు తుపాకీని ఘటన స్థలంలో వదిలేసి పరారయ్యాడని పోలీసులకు బాధితురాలి తల్లి వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.