
ఆ ‘అమ్మ’కు సెలవొద్దా?
అద్దె గర్భం (సరోగసీ) ద్వారా బిడ్డను కంటే ప్రసూతి సెలవుకు అర్హులు కారా? పిండాన్ని మోయనంత మాత్రాన పసిగుడ్డును సాకేందుకు అలాంటి అమ్మకు సెలవు అక్కర్లేదా...
ముంబై: అద్దె గర్భం (సరోగసీ) ద్వారా బిడ్డను కంటే ప్రసూతి సెలవుకు అర్హులు కారా? పిండాన్ని మోయనంత మాత్రాన పసిగుడ్డును సాకేందుకు అలాంటి అమ్మకు సెలవు అక్కర్లేదా? ఇవ్వకపోవడం న్యాయమా?
ఎందుకొచ్చిందీ ప్రశ్న: సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఓ నర్సుకు ఎదురైంది ఇలాంటి పరిస్థితి. 2004లో ఆమెకు పెళ్లయింది. 2007లో రెండుసార్లు ఐవీఎఫ్ చేయించుకుంటే... గర్భం దాల్చింది. అయితే 2008లో ఆరునెలల గర్భం పోయింది. మళ్లీ రాకపోవడంతో సరోగసీ ఉత్తమమని డాక్టర్లు ఆమెకు సూచించారు. దాంతో ఆమె (తాను గర్భం దాల్చే అవకాశం లేనపుడు తన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరించి... పిండాన్ని అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. అద్దెతల్లి నవమాసాలు ఆ పిండాన్ని మోసి శిశువుకు జన్మనిస్తుంది) సరోగసీ ద్వారా బిడ్డకు కనేందుకు ఒకామెతో ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా... గర్భం (అద్దె అమ్మ) దాల్చిన మూడునెలల నుంచే తనకు మెటర్నిటీ సెలవు (పూర్తిజీతంతో 180 రోజులు), శిశు సంరక్షణ సెలవు (పూర్తి జీతంతో 180) రోజులు ఇవ్వాలని సదరు నర్సు ఏడాది సెలవుకు దరఖాస్తు చేసుకోగా... రైల్వే నిరాకరించింది. కావాలంటే సెలవులో వెళ్లొచ్చని... అంతిమంగా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాకపోతే ‘జీతం లేని సెలవు’ (లాస్ ఆఫ్ పే)గా పరిగణిస్తామని సెంట్రల్ రైల్వే సమాధానమిచ్చింది. ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తుండగానే ఆమెకు జనవరి 29న కవలలు జన్మించారు. ఇద్దరు బిడ్డల ఆలనాపాలనా చూసుకునేందుకు ఈ అమ్మకు సెలవు అక్కర్లేదా?
ఏం చేసింది: సదరు నర్సు కోర్టుకెక్కింది. తనకు సెలవు ఇవ్వకపోవడం అన్యాయమని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని బాంబే హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం, రైల్వేకు నోటీసులు జారీచేసింది.
చట్టాలను పునఃసమీక్షించాల్సిందే: ఇలాంటి ఉదంతాలెన్నో మన చట్టాలను పునఃసమీక్షించాల్సిన అవసరాలను నొక్కిచెబుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలను మార్చుకుంటే... ఇలా ఓ అమ్మ సెలవు కోసం సుదీర్ఘంగా పోరాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు.