పట్టపగలు మెట్రో స్టేషన్ లో కిరాతకం | Sakshi
Sakshi News home page

పట్టపగలు మెట్రో స్టేషన్ లో కిరాతకం

Published Tue, Oct 25 2016 8:42 AM

పింకీ దేవి (ఫైల్) - Sakshi

గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు కిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్ లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోహిణి ప్రాంతంలో బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న పింకీ దేవి(34) అనే మహిళను జితేందర్ అనే ఆటోడ్రైవర్ పాశవికంగా పొడిచి చంపాడు. ముందుగా వెనుక నుంచి ఆమెపై జితేందర్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత ఆమె గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని చెప్పాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరించాడు. ఎలక్ట్రిక్ స్టాండింగ్ ఫ్యాన్ విసిరి అతడిని పట్టుకున్నారు.

పింకీ దేవిని సమీపంలోని ఉమా సంజీవని ఆస్పత్రికి తరలించగా సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రగాయాలతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. ఆమె దేహంలో 30 కత్తి గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యుడు దీపక్ మాథూర్ తెలిపారు. షిల్లాంగ్ కు చెందిన పింకీ దేవి తన భర్త మాన్ సింగ్ తో కలిసి గుర్గావ్ లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తోంది. మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది.

నిందితుడు జితేందర్ ను ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జితేందర్ గుర్గావ్ లోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్నాడని వెల్లడించారు. అయితే గత కొన్ని నెలలుగా పింకీ దేవిని జితేందర్ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement