'సోషల్‌’ ప్రచారాస్త్రం! | Social Media and the Elections | Sakshi
Sakshi News home page

'సోషల్‌’ ప్రచారాస్త్రం!

Nov 28 2017 4:32 AM | Updated on Sep 17 2018 5:36 PM

Social Media and the Elections  - Sakshi - Sakshi

సాక్షి, బెంగళూరు: వచ్చే ఏప్రిల్‌– మే నెలల్లో జరిగే అసెంబ్లీ 'ఎన్నికల ప్రచారానికి కర్ణాటక రాజకీయ పార్టీలు కొత్త అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. యువత, విద్యావంతులను ఆకర్షించేలా సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికల రూపకల్పనను ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఒకదానితో ఒకటి పోటీపడుతూ వాట్సాప్, ట్వీటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రచారం కోసం కార్పొరేట్‌ శైలిలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఈ బృందాలకు ‘సోషల్‌ మీడియా వింగ్‌’లుగా నామకరణం చేశాయి. ఇందులో బీజేపీ కాస్త ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఇక రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య ‘సోషల్‌ మీడియా’ వేదికగా వార్‌ను చూడొచ్చని స్పష్టమవుతోంది.  

స్మార్ట్‌ఫోనే ఆయుధం  
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రత్యేక సోషల్‌ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు కలుగుతున్న మేలుతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఆరోపణలను ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ పరిధిలో 7,000 వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 100–150 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఇటీవల బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సోషల్‌ మీడియా కాన్‌క్లేవ్‌’ను కూడా నిర్వహించింది. ఈ కాన్‌క్లేవ్‌కు వాట్సాప్‌ గ్రూపుల్లోని సభ్యులను ఆహ్వానించింది. మొదటి విడతలో 3,500 మంది హాజరయ్యారు.  

కాంగ్రెస్, జేడీఎస్‌లు అదే దారి
హైకమాండ్‌ ఆదేశాలతో ఇటీవల సోషల్‌ మీడియా వింగ్‌ను ప్రారంభించిన అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం 5,000 వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తన విధానాలను ప్రచారం చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య కూడా ఇటీవలే ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాలు  తెరిచారు. వీటి ద్వారా ఆయన తమ పార్టీ విధానాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీ పాలనను ఎండగడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో క్రియాశీలమయ్యే దిశగా జేడీఎస్‌ అడుగులు వేస్తోంది. పార్టీలోని  వలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ పేరిట ట్వీటర్‌ ఖాతాను నడుపుతోంది.  

ఆ వింగ్‌ల పనేంటంటే
ఆయా పార్టీల్లోని సోషల్‌ మీడి యా వింగ్‌లలో ఉన్న యాక్టివ్‌ సభ్యులు ఎప్పటికప్పుడు తమ పార్టీ విధానాలను సోషల్‌ మీడియా వేదికలపై పోస్ట్‌ చేస్తూ ఉండాలి. అంతేకాదు పార్టీలోని కీలక నేతల ప్రసంగాలు, వారి వీడియోలు వంటి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. అలాగే ఇతర పార్టీల లోపాలపై కూడా ముమ్మరంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement