గోవా బీచ్‌లో మందేస్తే అంతే! | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 25 2019 11:47 AM

Shell out Rs 2K Fine If you Want to Drink on Goa Beaches - Sakshi

పనాజీ : గోవా బీచ్‌లో బీరు తాగుతూ ఎంజాయ్‌ చేయలనుకుంటున్నారా? అయితే మీరు రూ. 2 వేల రూపాయల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉండాలి. అదేంటి బీచ్‌లో బీరు తాగితే ఇంత శిక్షా? అని అంటారా? అవును గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా బీచ్ లో మద్యం తాగినా, వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు.

‘  పర్యాటక చట్టంలో మేం రెండు మార్పులు తీసుకొచ్చాం. పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాతనే హోటల్‌ బుకింగ్‌ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చాం. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. చాలా ట్రావెల్స్‌ కంపెనీలు పర్యాటకశాఖతో సంబంధం లేకుండా హోటల్స్‌ను బుక్‌ చేస్తున్నాయి. ఈ తరహా చట్ట వ్యతిరేక పనులను మేం సహించం. ఇక రెండోది.. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్‌లో మద్యం సేవించినా, వంట చేసినా రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే. లేకుంటే మూడు నెలలు జైలు శిక్షఅనుభవించాలి.’ అని పర్యాటక మంత్రి తెలిపారు. బీచ్‌ల్లో బహిరంగంగా మద్యనిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement