వ్యూహాత్మకంగా భారత్కు సౌదీ కీలకం
సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ భేటీ
భారత్లో ఏడు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు పెడతాం
సౌదీ యువరాజు ప్రకటన.. భారత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి సౌభ్రాతృత్వాల పరిరక్షణకు భారత్, సౌదీ అరేబియా కట్టుబడి ఉన్నాయని ప్రదాని మోదీ తెలిపారు. ముష్కరుల కిరాతకానికి పుల్వామా ఆత్మాహుతి దాడి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ తర్వాత నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు.
భారత్ వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ కీలకదేశమని.. తమ బంధం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత్కు మద్దతు ప్రకటించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. కాగా, భారత ఆర్థిక వ్యవస్థపై అపార విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. సౌదీ అరేబియా దేశంలో 100 బిలియన్ డాలర్లు (రూ. 7 లక్షల కోట్లకుపైగా) భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఇంధన వనరులు, రీఫైనింగ్, పెట్రో కెమికల్స్, మౌలిక వసతులు, వ్యవసాయం, తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెడుతామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించగా.. ప్రధాని మోదీ ఆయన ప్రకటనను స్వాగతించారు.