‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత | Saravana Bhavan founder P Rajagopal passes away in hospital | Sakshi
Sakshi News home page

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

Jul 19 2019 4:13 AM | Updated on Jul 19 2019 4:13 AM

Saravana Bhavan founder P Rajagopal passes away in hospital - Sakshi

రాజగోపాల్‌ (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్‌ హోటళ్ల గ్రూప్‌ అధినేత పి.రాజగోపాల్‌ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్‌ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్‌ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు.

ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్‌ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్‌ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్‌ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్‌ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్‌ స్థాపించిన శరవణ భవన్‌ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement