సర్కారు సరైన దారిలోనే వెళ్తోంది | RSS gives thumbs up to Modi Government so far; PM promises to deliver | Sakshi
Sakshi News home page

సర్కారు సరైన దారిలోనే వెళ్తోంది

Sep 5 2015 1:43 AM | Updated on Aug 21 2018 9:33 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబద్ధత, అకింత భావంతో సరైన దారిలోనే వెళ్తోందని ఆరెస్సెస్ పేర్కొంది.

 దాని పనితీరును సమీక్షించడం లేదు: ఆరెస్సెస్
 సంఘ్-బీజేపీ భేటీకి హాజరైన మోదీ

 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబద్ధత, అకింత భావంతో సరైన దారిలోనే వెళ్తోందని ఆరెస్సెస్ పేర్కొంది. తాము రిమోట్ కంట్రోల్‌లా పనిచేస్తున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఆరెస్సెస్, బీజేపీ, ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నేతలతో ఢిల్లీలో సాగిన మూడు రోజుల సమన్వయ భేటీ శుక్రవారం ముగిసింది. భేటీ వివరాలను ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే విలేకర్లకు తెలిపారు. ‘మేం ప్రభుత్వ పనితీరును సమీక్షించడం లేదు. స్వయం సేవకులైన మంత్రులతో కొంత సమాచారం పంచుకుంటున్నాం. ఆ హక్కు మాకుంది. మేం వారికి ఆదేశాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం వచ్చి 14 నెలలే అయింది. ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా పురోగతి సాధించాలి. దేశ చరిత్రలో తొలిసారి ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను, ప్రభుత్వంపై వారి విశ్వాసాన్ని పెంచింది’ అని అన్నారు. సంఘ్ నేతలకు మంత్రులు తమ పనితీరు చెబుతూ.. అధికార రహస్యాలు వెల్లడించబోమన్న హామీని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘మాది చట్టవిరుద్ధ సంస్థ కాదు. మేం కూడా ఈ దేశ పౌరులమే. మంత్రులను అడిగే హక్కు మాకుంది. రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న కాంగ్రెస్‌కు మాగురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని వ్యాఖ్యానించారు.

అయోధ్య రామమందిర అంశం సుప్రీం కోర్టులో ఉంది కనుక, ప్రభుత్వం అనుకున్న విధంగా రామమందిర నిర్మాణం జరిగే వరకు వేచిచూస్తామని పేర్కొన్నారు. సమన్వయ భేటీలో దేశ భద్రత, ఉగ్రవాదం, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు తదితరాలపై చర్చించామని, ఆయా అంశాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు.  
 ముగింపు సమావేశంలో మోదీ
 సంఘ్-బీజేపీ సమన్వయ సమావేశాలకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ భేటీకి మంత్రులు వెళ్లడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నా ప్రధాని హాజరవడం చర్చానీయాంశమైంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భేటీలో రెండు గంటలు పాల్గొని, పావుగంట ప్రసంగించిన మోదీ.. సుపరిపాలన, పారదర్శతకు తీసుకున్న చర్యలను వివరించారు. తాను స్వయంసేవక్ కావడం గర్వకారణంగా ఉందని, సమాజంలో చిట్టచివరికి వ్యక్తి కూడా అభివృద్ధి ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.  సమావేశాల్లో మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్దిష్ట గడువులో గంగానది శుద్ధి జరగకపోవడంపై బీజేపీ,  ఆరెస్సెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
 ఆరెస్సెస్ చేతుల్లో మోదీ సర్కారు: సీపీఎం
 ఈ భేటీలో కేంద్ర మంత్రులు తాము సాధించిన ప్రగతి గురించి చెప్పడం ప్రజాస్వామ్యాన్ని  కించపరచడమేనని సీపీఎం మండిపడింది. మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ ప్రత్యక్ష నియంత్రణలో ఉందని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోందని, దేశాన్ని హిందూ దేశం చేయాలన్న సంఘ్ శక్తుల యత్నానికి మోదీ చట్టబద్ధత కల్పిస్తున్నారని ఓ ప్రకటనలో విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement