సంచలనం; మరో షెల్టర్‌ హోం అకృత్యాలు | Rapes, Murders Alleged At Bhopal Shelter Home; Ex-Armyman, Arrested | Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న మరో షెల్టర్‌ హోం అకృత్యాలు

Sep 15 2018 12:21 PM | Updated on Sep 15 2018 2:40 PM

Rapes, Murders Alleged At Bhopal Shelter Home; Ex-Armyman, Arrested - Sakshi

ఫైల్‌ ఫోటో

భోపాల్‌: మద్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ఒక షెల్టర్‌హోం చిన్నారులపై వెలుగుచూసిన అకృత్యాలు సంచనలం రేపాయి. ఒక ప్రైవేటు వసతి గృహం​ యజమాని దివ్యాంగులైన బాలబాలికలపై  చాలాకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస‍్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యజమాని లైంగిక హింస, వేధింపులు కారణంగా తమ సహచరులు ముగ్గురు చనిపోయినట్టుగా బాధితులు ఆరోపించారు. దీంతో యజమానిని శనివారం అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఒక మాజీ సైనికుడు (70) భోపాల్‌లో భైరాంఘర్‌ ప్రాంతంలో ప్రైవేటుగా ఒక షెల్టర్‌ హోం నిర్వహిస్తున్నాడు. దివ్యాంగులైన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. కాలయముడిలా మారాడు. నిత్యం దారుణమైన లైంగిక వేధింపులు, హింసకు పాల్పడేవాడు. దీంతో బాధితులు యజమాని అకృత్యాలపై సాంఘిక న్యాయ విభాగానికి మొరపెట్టుకున్నారు. షెల్టర్‌ హోం యజమాని లైంగిక హింస కారణంగానే విపరీతమైన రక్తస్రావంతో ఒక బాలుడు మరణించగా, గోడకేసి తలను మోదడంతో మరో విద్యార్థి అసువులుగా బాసాడు. మరో ఉదంతంలో రాత్రంతా చలిలో బలవంతంగా  పడుకోబెట్టడంతో మరో విద్యార్థి ప్రాణాలు విడిచాడని వివరించారు. దీనిపై  తదుపరి విచారణకు ఆదేశించామని సోషల్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ మోహన్‌ తివారి వెల్లడించారు. 

ఈ ఉదంతంపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ విభాగం స్పందించింది. గతంలో ఇతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించింది.  బాధితులతో కలిసి స్థానిక టీటీ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని డీఐజి ధర్మేంద్ర  చౌదరి తెలిపారు.  

1995లో రిజిస్టర్ చేసుకున్న ఈ హోం రెండు శాఖలను  (భైరాంఘర్‌, హోషంగాబాద్) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధిత  నిధులను కూడా పొందుతోంది. 2003 నాటి లెక్కల ప్రకారం  42 మంది బాలురు, 58 మంది బాలికలు ఈ హోంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 2017 లో హొషంగాబాద్‌ కలెక్టర్‌కు లైంగిక వేధింపుల గురించి ఓ బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సరిగా ఉందని తేలినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అయితే, ఫిర్యాదు తర్వాత హోషంగాబాద్ శాఖ మూసివేసారు.

Advertisement
 
Advertisement
Advertisement