
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఉదయం రష్యాకు బయలు దేరారు. రష్యా రాజధాని మాస్కోలో మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. రాజ్నాథ్ వెంట రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా వెళ్లారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత్-రష్యాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ 75వ విజయోత్సవ దినోత్సవ పరేడ్లో పాల్గొంటారు. ( చైనా దుస్సాహసానికి దిగితే ఆయుధాలు వాడొచ్చు)
అంతకు క్రితం ఆయన స్పందిస్తూ.. ‘‘నేను మూడు రోజుల పర్యటన నిమిత్తం మాస్కో వెళుతున్నాను. ఈ పర్యటనతో భారత్- రష్యాల రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చర్చల ద్వారా బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ 75వ విజయోత్సవ దినోత్సవ పరేడ్లోనూ పాల్గొంటాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.