గురువాయుర్లో మోదీ తులాభారం
శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్న ప్రధానమంత్రి
రేపు తిరుమలకు రాక
సాక్షి, అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళలో పర్యటించారు. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో కమలం పూలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. ఈ మధ్యలో ఆయన మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
(రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక)
కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు.