సయీద్‌ ర్యాలీలో పాలస్తీనా దూత | Palestine says sorry to India for presence of its Pakistan envoy at Hafiz Saeed rally | Sakshi
Sakshi News home page

సయీద్‌ ర్యాలీలో పాలస్తీనా దూత

Dec 31 2017 3:02 AM | Updated on Jul 25 2018 1:49 PM

Palestine says sorry to India for presence of its Pakistan envoy at Hafiz Saeed rally - Sakshi

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్‌ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్‌ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘పాలస్తీనా రాయబారితో పాటు రమల్లాలోని ఆ దేశ విదేశాంగ శాఖకు మా ఆందోళనల్ని స్పష్టం చేశాం.

ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొన్న సయీద్‌తో కలిసి శుక్రవారం రావల్పిండిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలస్తీనా రాయబారి పాల్గొనడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ దేశానికి గట్టిగా చెప్పాం’ అని పేర్కొంది.  ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్‌ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్‌ తెలిపింది. ‘ఈ అంశాన్ని తగిన విధంగా పరిష్కరిస్తాం. భారత్‌లో సంబంధాలకు పాలస్తీనా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉగ్రపోరులో ఆ దేశానికి అండగా ఉంటాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారితో సంబంధాలు పెట్టుకోం’ అని పాలస్తీనా పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement