బుద్ధి చూపించుకున్న పాక్‌ | Pakistan Leaders Gifted A Gold Plated Submachine Gun To Saudi Prince Salman | Sakshi
Sakshi News home page

బుద్ధి చూపించుకున్న పాక్‌

Feb 22 2019 11:22 AM | Updated on Feb 22 2019 11:22 AM

Pakistan Leaders Gifted A Gold Plated Submachine Gun To Saudi Prince Salman - Sakshi

ఇస్లామాబాద్‌: తమ దేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినవారికి శాలువా కప్పి సన్మానం చేయడమో.. లేక ఆకర్షణీయమైన బహుమతులివ్వడమో, జ్ఞాపికలు అందించడమో చేస్తుంటారు నాయకులు. అయితే ఇచ్చే ఆ బహుమానంలో వారి అభిమతం, ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్‌ నాయకులు వారి దేశానికి వచ్చిన అతిథిక ఓ బహుమానం ఇచ్చి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు. భారత్‌ పర్యటన కంటే ముందు సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి ఎంపీలు సల్మాన్‌కు ఓ తుపాకీని బహుకరించారు. బంగారు పూతతో తయారైన ఈ గన్‌ జర్మనీ ఇంజనీర్లు ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. (ఆధారాలు ఉంటే భారత్‌కే మద్దతు : సౌదీ మంత్రి)


హెక్లర్‌ అండ్‌ కోచ్‌ ఎంపీ5 సబ్‌మెషీన్‌ గన్‌ను సల్మాన్‌కు పాక్‌ ఎంపీలు కానుకగా ఇవ్వడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ‘అతిథులకు ఏ పువ్వో, స్వీటో ఇవ్వకుండా తుపాకీ ఇచ్చారంటే వీళ్లు తీవ్రవాదులకంటే డేంజర్‌’అంటూ పలువురు విమర్శిస్తున్నారు. హింసను ప్రేరేపించే పాక్‌ అసలు ఉద్దేశం బయటపడిందని పేర్కొంటున్నారు. శాంతి అనేది పాక్‌ డీఎన్‌ఏలోనే లేదని మరికొందరు ట్వీట్‌ చేస్తున్నారు. అతిథికి తుపాకీ కానుకగా ఇవ్వడంతో పాక్‌ తన బుద్ధి చూపించుకుందని విమర్శిస్తున్నారు. (భారత్‌కు తగు జవాబివ్వండి) 

దీనిపై అరబ్‌ దేశాల్లోనూ ఆందోళన వక్తం అవుతున్నాయి. ఇటీవల సౌదీ జర్నలిస్టు ఖషోగ్గిని ప్రిన్స్‌ సల్మానే చంపించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో తుపాకీ బహుమతిగా ఇచ్చి మరింత ఆజ్యం పోస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలేదని బాహాటంగా పాక్‌ ప్రకటిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం తీవ్రవాదులను పెంచి పోషిస్తుందన్న విషయం జగమెరిగిన సత్యం. పుల్వామా ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగా ప్రకటించి.. భారత్‌పై దాడి చేయండి అంటూ భద్రత బలగాలకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై యావత్‌ దేశం ఉగ్రవాద ప్రేరేపిత పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ)

Advertisement
 
Advertisement
Advertisement